కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైనదని, మహి మాన్వితమైనదని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సాయంత్రం విజయనగరంలోని పూల్ బాగ్ లో వేంచేసియున్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల రాక సందర్భంగా ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ తిరోత్సవం, పడిపూజ,జ్వాలా తోరణం కార్యక్రమాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో మన సనాతన సంప్రదాయాలు కాపాడుతూ, ప్రజలలో ఆధ్యాత్మిక భావాలు , సేవా తత్పరత నెలకొనే విధంగా సంఘం చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమన్నారు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమని, కార్తీకదీపం ఉత్తమ ఫలాలను ఇస్తుందని అన్నారు.
కార్తీక పౌర్ణమి నాటి దీపదానాన్ని ప్రజలు అత్యంత పవిత్రంగా భావిస్తారని అన్నారు. అయ్యప్ప సేవా సంఘం చేసే ప్రతి ప్రజాహిత కార్యక్రమానికి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వామివారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.మంగళ వాయిద్యాలతో, భక్తుల శరణు ఘోషలతో అయ్యప్ప దేవాలయం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.