పచ్చదనం పెంచటం, స్వచ్చమైన ఆక్సీజన్ అందరికీ అందాలనే లక్ష్యంతో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ అప్రహతిహారంగా కొనసాగుతోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇవాళ కూడా రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మూడు మొక్కలు నాటారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఎం.పి. బీబీ పాటిల్, సంగారెడ్డి జె.సి నిఖిల తదితరులను మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు కాంత్రి కిరణ్. ఇక ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు, నటుడు, పారిశ్రామిక వేత్త మురళీ మోహన్ లు కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. ఆకు పచ్చని తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి సంకల్పంలోంచి పుట్టిన హరితహారం, దానికి కొనసాగింపుగా ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అపూర్వ రీతిలో కొనసాగటం పట్ల వీరందరూ సంతోషాన్ని ప్రకటించారు. సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటడం, తమ తోటి వారితో నాటించి, వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరారు.