బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండు సంవత్సరాలయిందని కరీంనగర్ కి ఇప్పటివరకు ఏం సాధించారని కరీంనగర్లో జరిగిన మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి బండి కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ కి నిధులు ఎప్పుడు కేటాయిస్తున్నారో కేంద్రాన్ని అడగాలన్నారు.
రాష్ట్రాల మధ్య సమాఖ్య స్ఫూర్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్టోందని, జీఎస్టి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజా విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాల్నితీసుకురావడం చాలా హేయమైన చర్య దీనిపై బండి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్లే నేడు ఢిల్లీ అష్ట దిగ్బంధనంలో కూరుకుపోయిందని, అంతర్జాతీయ సమాజం కూడా భారతదేశ మోదీ ప్రభుత్వాన్ని గమనిస్తోందని విమర్శించారు. నిరసన తెలియజేస్తున్న రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని కవిత డిమాండ్ చేశారు.
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని, వ్యవసాయ చట్టం, విద్యుత్ చట్టం, జీఎస్టి బకాయిలు ఇలాంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం వైఖరి సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందని కల్వకుంట్ల కవిత విమర్శించారు.