నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిజామాబాద్ నేతలతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏమీ లేదని ఆయన అన్నారు. అసమర్ధ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. మనం కట్టే పన్నుల్లో 46 శాతం మాత్రమే తిరిగి వస్తున్నాయని, తాను చెప్పింది తప్పయితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. జాతీయ రహదారులు వేసి టోల్ వసూలు చేస్తలేరా? అని ప్రశ్నించారు.
మోదీని దేవుడు అంటున్నారు.. ఎవరికి దేవుడు? అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర కొట్లాటను అపలేని వ్యక్తి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారట.. అంటూ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి ఒకటిన పెట్టే బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయైనా ప్రత్యేకంగా తెచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు.
ఇంతవరకు నిజామాబాద్లో రూ. 936 కోట్ల 68 లక్షలు ఖర్చు చేశామని, రాబోయే ఆరు నెలల్లో మరో వంద కోట్లు వెచ్చిస్తామని స్పష్టం చేశారు. తిలక్ గార్డెన్ అభివృద్ధి చేస్తున్నామని, రూ. 50 కోట్లతో కళాభారతి కడుతున్నామని, జిల్లాలోని కళాకారులు, సాహితివేత్తలు, రచయితలకు అత్యుత్తమమైన కళాభారతిని అందించాలని భావిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు రూ. 50 కోట్ల చొప్పున మంజూరు చేశామని, చెప్పినవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.