అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అవినీతి నిర్మూలన పై రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబ్బు అన్ని చెడులకు మూలమని అన్నారు. పిట్టలు ఇతర పక్షుల గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయని, పిల్లలు కాగానే ఎలాగైతే ఎగిరిపోతాయో, అలాగే అవినీతి డబ్బు ఉండదని అన్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమని అన్నారు. పొరుగు వారినుండి ఆశించకూడదని, తీసుకొనుట కంటే ఇవ్వడం ఎంతో మేలని అన్నారు. నీతివంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారని ఆయన తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అని ఆయన తెలిపారు. అవినీతి రహిత సమాజంతో దేశం అభివృద్ధి పథంలో వెళుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులుగా సొసైటీలో గౌరవ స్థానంలో ఉన్నామని, వేతనం, ఆరోగ్య ప్రయోజనాలు, సామాజిక భద్రత, కారుణ్య నియామకం తదితర ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నామని అన్నారు. వేతనంలో దేశంలో మొదటి 5 వ స్థానంలో ఉన్నట్లు, అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదని అన్నారు. అవసరాలకు హద్దు ఉంటుంది కానీ ఆశలకు హద్దు ఉండదని, మనకంటే క్రింది స్థాయిలో ఉన్న వారితో పోల్చుకొని కృతజ్ఞతా భావంతో సంతృప్తిగా జీవించాలని అన్నారు. మనిషి సామాజిక జంతువు అని, సామాజిక స్పృహ తో మెలగాలని, ఆశలను హద్దులో ఉంచుకోవాలని అన్నారు. పనే పూజ అని, బాధ్యతగా మెలిగి అవినీతికి దూరంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో అవినీతి రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ చైర్మన్ ఆదర్శ్ సురభి, న్యాయమూర్తులు, జిల్లా అధికారులు, ఎసిబి డిఎస్పీ సూర్యనారాయణ, ఎసిపిలు, తదితరులు పాల్గొన్నారు.