విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించే ఇంధనం చార్జీలు మరియు విద్యుత్తు కొనుగోలు ధరలు పెరుగుతున్నాయన్న సాకుతో ఈ భారాన్ని నెలవారీగా వినియోగదారులపై వేయాలని కేంద్ర విద్యుత్తు శాఖ విద్యుత్తు నిబంధనలు 2005 ను సవరిస్తూ కొత్త నిబంధనలు జారీచేయడం దుర్మార్గమని, ఇది ప్రత్యేక్ష దోపిడీలో భాగం అని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
నేలవారీగా విద్యుత్తు చార్జీలు పెంచి భారం వేయడం పేద ప్రజల నడ్డివిరచడమేనని అయన మండిపడ్డారు. ఇంధనం, విద్యుత్తు కొనుగోలు సర్దుబాటు సర్ ఛార్జి అంటే వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేయడానికి అయ్యేఖర్చు అని, ఈ అదనపు భారాన్ని లెక్కించి వినియోగదారుల బిల్లులో కలపాలని కేంద్ర విద్యుత్తు మంత్రుత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటన్నారు. దేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలు తమ ఆదాయంలో ఎక్కువ వాటాను విద్యుత్తు బిల్లులపై ఖర్చు చేస్తున్నారని అయన గుర్తు చేసారు. నిరుద్యోగంతోపాటు భారీగా నిత్యావసర సరకుల ధరలు మరియు ఇంధన చార్జీల పెరుగుదలతో మోడీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు ఇప్పటికే తీవ్రమైన అసమానతలను,
అడ్డంకులను అనుభవిస్తున్నారని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలందరికి కేంద్ర ప్రభుత్వమే ఉచిత విద్యుత్తు ను పంపిణి చేయాలనీ అయన డిమాండ్ చేసారు. నెలనెలా విద్యుత్తు చార్జీల సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేనిపక్షంలో బలమైన ఉద్యమాలు నిర్వహించి ఈ దోపిడీని అడ్డుకుంటామని ఈ.టి. నరసింహ హెచ్చరించారు.