రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ టిడిపి నేతల డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని టిడిపి నేతలు, నల్లకండువాలు ధరించి నిరసన తెలిపి, నల్ల జీఓ కాపీలను దహనం చేశారు. అనంతరం మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు కొండా వీరయ్య, నియోజకవర్గ మహిళా
అధ్యక్షురాలు అమరా రమాదేవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు అద్దంకి అనిత భాయిలు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు సభలు, సమావేశాల్లో ఆటంకాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్లీపర్ సెల్స్ వల్లే గుంటూరు దుర్ఘటన జరిగింది. పేదలకు సాయం చేయడానికి వచ్చిన ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు అరెస్ట్ విషయంలో పోలీసులు కూడా ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
భారతరాజ్యాంగం ప్రకారం పౌరులకు సంక్రమించిన భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడానికి ఈ ముఖ్యమంత్రి ఎవరు? ఆయనతెచ్చిన చీకటిజీవో ఎక్కడిది? జీవో ఇచ్చిన ముఖ్యమంత్రే నిన్న రాజమహేంద్రవరంలో సభ ఎలా నిర్వహించాడు? ఎవరి అనుమతితో ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిన్న రోడ్లుమొత్తం బ్లాక్ చేయించాడు? జనం తిడుతున్నా, పోలీసులు ఏమీచేయలేక నిస్సహాయ స్థితిలో ఉండి పోయారు.జగన్ సభకు వచ్చిన వృద్ధురాలు మహిమ రత్నం కాలికి పెద్దగాయమైంది. ఆమె కాలు తీసేసే పరిస్థితి వచ్చింది.
ఆ ఘటనకు ఎవరిపై కేసు పెట్టాలి? ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలా…లేక కలెక్టర్ పై పెట్టాలా? తానిచ్చిన జీవోని ముఖ్యమంత్రే ఉల్లంఘించాడు. మరి ఆయనపై చర్యలు ఉండవా? అధికారపార్టీకి ఒక న్యాయం… ప్రతిపక్షాలకు ఒక న్యాయమా? మీది ధృతరాష్ట్ర పాలన కాదా ముఖ్యమంత్రి ? అని ప్రశ్నించారు? తక్షణమే నల్ల జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.