శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం చెందారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ఆయన ప్రజలకు తెలియ చేశారు.
లక్షలాది మందికి మార్గదర్శనం చేయించిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న తమ దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా ఉన్నారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు.
అందరికన్న దైవం గొప్పదని, ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమం ప్రీతితో స్వీకరించి మనకు కావాల్సిన ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు. ప్రతిసంవత్సరం ములుగు సిద్ధాంతి గారు అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నామని, ఈ సందర్భంగా mulugu.com నిర్వాహకులు కొడుకుల సోమేశ్వరరావు తెలిపారు.
లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారినుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు ములుగు సిద్ధాంతిగారు. వివిధ దేశాలలో వీరికి భక్తులున్నారు. ములుగు సిద్ధాంతి గా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు ఎం ఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచారు.