మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మీద రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా పడింది. ముంబై డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్.. ఆ మంత్రి మీద పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించి ఆయన సమాధానం ఇచ్చేందుకు బాంబే హైకోర్టు ఆరు వారాల గడువు విధించింది. నవాబ్ మాలిక్ తో పాటు మరో ఏడుగురి మీద ఈ పరువు నష్టం దావా వేసింది బ్యాంక్.
జూలై 1 నుంచి జూలై 4 మధ్య తమ బ్యాంకుకు సంబంధించి అభ్యంతరకరంగా, అవమానిస్తూ ముంబై మహానగరంలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారని, వాటిని కొన్ని లక్షల మంది చూశారని, దాని వల్ల తమ బ్యాంకు పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆ బ్యాంకు తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది అఖిలేష్ చౌబే.
తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు నవాబ్ మాలిక్ తో పాటు మరో ఏడుగురికి కూడా తమ బ్యాంకు తరఫున నోటీసులు పంపినట్టు కోర్టుకు తెలిపారు న్యాయవాది. బ్యాంకు ఇచ్చిన నోటీసులను విత్ డ్రా చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బహిరంగ క్షమాపణ చెప్పేది లేదని మాలిక్ తమకు చెప్పినట్టు కోర్టుకు విన్నవించారు అఖిలేష్.