ఎంత చెడ్డవాడైనా సొంత బిడ్డను తల్లి చంపేస్తుందా? ఈ తల్లి మాత్రం చంపేసింది. రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పల్లెతండాకు చెందిన ఇస్లావత్ హరిలాల్ (20) పనీపాట లేకుండా జులాయిగా తిరిగేవాడు.
ఎన్ని సార్లు చెప్పినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లి చాంది విసిగిపోయింది. ఇక అతడితో లాభం లేదనుకున్న ఆమె ఈ నెల 22న ఇంట్లోనే అతడి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలో కంపచెట్లలో పడేసింది. హత్య విషయం బయటపడకుండా తండా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.
హరిలాల్కు మతిస్థిమితం లేదని, భోజనం కూడా సరిగా చేసేవాడు కాదని పేర్కొంది. ఈ కారణంగా బయటకు వెళ్లిన అతడు చనిపోయి ఉంటాడని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా హత్య అని తేలింది.
దీంతో ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని జుడీషియల్ రిమాండ్కు తరలించారు.