సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ డీసీపీ ట్రాఫిక్ టి. శ్రీనివాస రావు ప్రైవేట్ బస్సు, RMC, కన్ స్ట్రక్షన్ వాహనాలు, ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యలతో సమావేశం నిర్వహించారు. అనంతరం “MY Transport is Safe” యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ ట్రాఫిక్ టి. శ్రీనివాస రావు మాట్లాడుతూ నో ఎంట్రీ సమయాల్లో తిరిగే భారీ వాహనాలకు ప్రైవేట్ బస్సులు, RMC, కన్ స్ట్రక్షన్ వాహనాలు, స్కూల్ బస్సుల కోసం ప్రత్యేక స్టిక్కర్లు రూపొందించామన్నారు. ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రతా దృష్ట్యా అవసరమైన వాహనాలకు రూట్ లో మాత్రమే పర్మిషన్ తీసుకోవాలన్నారు.
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, వినియోగదారుల భద్రత దృష్ట్యా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు “MY TRANSPORT IS SAFE” అనే అప్లికేషన్ ద్వారా ప్రత్యేక QR కోడ్ కలిగిన స్టిక్కర్లను రూపొందించారన్నారు. నో ఎంట్రీ సమయాలలో ప్రత్యేక అనుమతి కలిగిన వాహనాలకు ఈ స్టికర్క్లను ఇవ్వడం జరుగుతుందన్నారు.
సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాలకు ఉదయం 7.30 గంటల నుండి 11.30 మరియు సాయంత్రం 4 గంటలు నుండి 10.30 వరకు అనుమతి లేదన్నారు. ప్రత్యేక కారణాల దృష్ట్యా ఎవరైనా ఇటువంటి వాహనాలు తిప్పాలంటే సైబరాబాద్ కమీషనర్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి పర్మిషన్ తీసుకునే వాహనాలకు ఇక నుండి QR కోడ్ కలిగిన స్టిక్కర్లను అందజేస్తారు. ఈ స్టిక్కర్లో ఉన్న QR కోడ్ లో వాహనానికి సంబంధించిన అన్ని వివరాలు అంటే వాలిడిటీ, రూట్ ఇతర ముఖ్యమైన వివరాలు పొందుపరచి ఉంటాయన్నారు. అందువల్ల పర్మిషన్ తీసుకున్న వాహనాలన్నీ ఈ ప్రత్యేక QR కోడ్ కలిగిన స్టిక్కర్లను తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ACP హనుమంత రావు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.