ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి పరిస్థితులలో జుమా నమాజు సామూహికంగా మసీదులలో ఆచరించడం కరెక్ట్ కాదని ప్రస్తుతం అంటు వ్యాధి ప్రబలి ఉన్నందున ఇళ్లలోనే నమాజులు చేసుకోవచ్చునని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితులలో ఇళ్లలో నమాజు చేసుకోవడంతో నమాజు పూర్తి అవుతుంది, ప్రతిఫలం కూడా పూర్తిగా లభిస్తుంది అని అన్ని జమాతుల్ పెద్దలు, ధార్మిక పండితులు పిలుపు ఇస్తున్నారని ఆయన అన్నారు. కాబట్టి ప్రభుత్వం చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. ఈ బాధ్యత ప్రతి భారత దేశ పౌరుడిపై ఉందని పేర్కొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా షిబ్లీ పిలుపునిచ్చారు.