వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే సీఎంగా వేరే వ్యక్తిని నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 2022లో మరోసారి యోగి ఆదిత్యనాథే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. అలాగే 2024లో మోడీనే మూడోసారి ప్రధాని కానున్నారని ప్రకటించారు.
యూపీలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు 2022లో పునాది పడాలని అమిత్ షా అన్నారు. దీపావళి తర్వాత ఎన్నికల హీట్ పుంజుకోనుందని.. కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం పని చేయాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 300 సీట్లలో గెలుపే టార్గెట్గా పనిచేయాలని సూచించారు.