జాతీయ రహదారుల పనులలో వేగాన్ని పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గం వారీగా పెండింగ్ పనుల వివరాలను, కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అందోల్ – అకోలా రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆందోల్ జోగిపేట్ బైపాస్ రోడ్డు, డ్రైన్ స్ పనులను పూర్తిచేయాలని ఉన్న రోడ్లను ఇంప్రూవ్ చేయాలని అని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సూచించారు.
అసంపూర్తి పనులన్నింటినీ తొందరగా పూర్తిచేయాలని, జహీరాబాద్ పట్టణంలో డ్రయిన్స్, ఫుట్ పాత్ పనులకు, కోహీర్ – గుడ్ గార్ పల్లి రోడ్డు పనులకు సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఆర్ అండ్ బి ఎస్ ఈ కి మంత్రి సూచించారు.
వరద కోతకు గురైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. బ్యాలెన్స్ రోడ్డు పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు, కూలిపోయిన ఇళ్లకు, పిడుగులు పడి చనిపోయిన పశువులకు నష్ట పరిహారం అందించాలని రెవిన్యూ డివిజనల్ అధికారులకు మంత్రి సూచించారు.
ఈ సమీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు,సంగారెడ్డి నారాయణఖేడ్ రెవిన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.