గత నెల రోజులకు పైగా రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో చేనేత వృత్తి కుంటుపడి పోయిందని, దీని మీద ఆధారపడ్డ వారు అర్ధాకలితో అలమటిస్తున్నారని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేత కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నేతన్న కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పద్మశాలి సంఘం సభ్యులు అభినందనీయులని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దానిని కట్టడి చేయడానికి కొన్ని కుల వృత్తుల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని, దీంతో కొన్ని కుల వృత్తి దారుల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్న మాట వాస్తవమని ఆయన అన్నారు.
లాక్ డౌన్ ముగిసేంత వరకు పట్టణంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించకుండా తాము చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు. అభాగ్యులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు. కరోనా కట్టడి అయ్యేంత వరకు ఎవరు కూడా ఇళ్ళు దాటి బయటకు రాకుండా, సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వెంకట్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు మూడ వేణు, మిర్యాల ప్రకాష్, జెల్లా మనోహర్, గంజి వెంకటేశ్వర్లు, సూరేపల్లి రాములు, పెద్ది దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.