అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాట తప్పను మడమ తిప్పను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే “సిపిఎస్” రద్దు చేస్తాను ఏ ప్రభుత్వము ఇవ్వని అద్భుతమైన “పిఆర్సి” ఇస్తాను అని ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న ఆయిల్ ఇచ్చారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇచ్చిన మూడు PRC జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఉద్యోగస్తుల జీతాలతో పాటు వారి జీవన విధానంలో కూడా పురోగతి రావాలని గత ప్రభుత్వాలతో ఉద్యోగ సంఘాలు పోరాడి సాధించుకున్న ఫిట్మెంట్ బెనిఫిట్స్ లో సైతం కోత విధించడం ఏపీ ప్రభుత్వానికి ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) ఉద్యోగస్తుల పాలిట “శాపంగా” మారిందని పదవీ విరమణ తర్వాత ఏ ఒక్కరికి కనీస పెన్షన్ భద్రత కూడా ఉండదని దేవుని దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే “సిపిఎస్ ను రద్దు” చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. “ఓ పి ఎస్ పద్ధతిలో పెన్షన్లు” ఇస్తామన్న సీఎం ప్రకటనతో నమ్మి మోసపోయామా లేక నమ్మించి మోసం చేశారా అన్న ఆవేదనతో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మిక,పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇచ్చిన 3 చీకటి జీవోలను బహిరంగంగా రోడ్లపై దహనం చేస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాలలోని ఉద్యోగస్తులకు సముచితమైన పిఆర్సి, ఫిట్మెంట్, పెన్షన్ బెనిఫిట్స్ లతోపాటు పదవీ విరమణ చేసిన ప్రతి ఉద్యోగస్తునికి,ఉపాధ్యాయునికి అదే రోజు గౌరవంగా సత్కరించి “రిటైర్మెంట్ బెనిఫిట్స్” చేతికిచ్చి గౌరవంగా ఇంటికి సాగనంపారని నవీన్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. నేడు పదవీ విరమణ చేసిన వారికి “రాగి నయాపైసా” పదవీ విరమణ బెనిఫిట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను సాగనంపడం అన్యాయం కాదా! అని ఆయన ప్రశ్నించారు.