అరసవల్లి వరకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్ర కు నవతరంపార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. చిలకలూరిపేట నవతరంపార్టీ కార్యాలయంలో ఈమేరకు ఆయన ప్రకటన మీడియాకు విడుదల చేసారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.పోలీసు శాఖ అనుమతి రాదని ముందే ఊహించామని అన్నారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ అనుమతి నిరాకరించడం తప్పని అన్నారు.
అరసవల్లి కి రైతులు చేస్తున్న పాదయాత్ర చట్టవ్యతిరేకమైన కార్యక్రమం కాదని డీజిపి గుర్తించలేకపోవడం దురదృష్టకరమన్నారు.గత తిరుపతి పాదయాత్రలో అమరావతి రైతులు రాయలసీమ వాసుల మనసులు గెలుచుకుని అమరావతికి జై కొట్టించారని ఇప్పుడు అదే మాదిరిగానే ఉత్తరాంధ్ర వాసులతో రాజధాని అమరావతి కి జై కొట్టిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రయోగం విఫలమవుతుందనే భయంతోనే పాదయాత్ర కు అనుమతి తిరస్కరించారు అని రావు సుబ్రహ్మణ్యం విమర్శించారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన బలహీన పడుతుంది అని తెలిసే ప్రభుత్వం చట్టం తెలిసికూడా అనుమతి నిరాకరించారు అన్నారు. ముప్పై ఐదువేల మందికి ప్రతినిధులు గా ఆరు వందల మంది రైతులు పాల్గొనే ఈ యాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అని వారికి నవతరంపార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.