పోలీసు లాకప్ రఘురామకృష్ణంరాజు ఆరోగ్యంపై పెను ప్రభావం చూపింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె. రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే కారణంతో ఏపి పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అక్కడ నుంచి మంగళగిరి తీసుకువెళ్లి అక్కడ లాకప్ లో ఉంచారు.
పోలీసు లాకప్ లో తనపై దాడి జరిగిందని రఘురామ ఆరోపించారు. దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు జరిపి ఆయనపై దాడి జరిగినట్లు నిర్ధారించారు. ఆయనకు బెయిల్ మంజూరు అయినా ఆర్మీ ఆసుపత్రి వారు డిశ్చార్చి చేయలేదు.
అంత దారుణంగా ఆయన పరిస్థితి ఉంది. దాంతో ఆయన ఢిల్లీలో ఎయిమ్స్ కు వెళ్లారు. దేశ రాజధానిలో కరోనా ఉధృతంగా ఉండటంతో ఎయిమ్స్ మొత్తాన్ని కొవిడ్ రోగుల కోసం వాడుతుండగా, కేంద్రం పెద్దల జోక్యంతో అదే ఆస్పత్రిలో వైసీపీ రెబల్ ఎంపీకి ప్రత్యేక వార్డు కేటాయించారు.
కాలిపై పోలీసు గాయాలకు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లిన వైసీపీ రెబల్ ఎంపీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకొందరు బీజేపీ ముఖ్యులు కూడా ఆయనను పరామర్శించినట్లు తెలుస్తోంది.
ఏపీ సర్కారు తనకిచ్చిన చికిత్సపై ఎంపీ రఘురామ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. జీజీహెచ్ లో తనపై ఏదైనా విషప్రయోగం జరిగి ఉంటుందా అని రఘురామ అనుమానం వ్యక్తంచేశారని, అలాంటిదేదైనా జరిగిందో లేదో తేల్చాల్సిందిగా ఎయిమ్స్ డైరెక్టర్ ను ఎంపీ కోరినట్లు ఆంధ్రజ్యోతి ఛానల్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం ఢిల్లీకి వెళ్లిన సమయంలో, గురువారం ఎయిమ్స్ లో అడ్మిట్ అయిన సందర్భంలోనూ ఎంపీ రఘురామ వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. పలకరించిన మీడియాతో మాట్లాడేందుకు రఘురామ నిరాకరించారు.
మీడియాతో నేరుగా మాట్లాడేందుకు నిరాకరించినప్పటికీ వైసీపీ రెబల్ ఎంపీ సోషల్ మీడియా ద్వారా కీలక సందేశాన్నిచ్చారు. జగన్ సర్కారు మోపిన రాజద్రోహం కేసుకు సంబంధించిన విషయాలేవీ మీడియాతో లేదా సోషల్ మీడియాలో మాట్లాడరాదన్న షరతుపై సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఇవ్వడం తెలిసిందే.
అయితే ఆ ఒక్క అంశం తప్ప సాధారణ ప్రకటనలకు ఎలాంటి అభ్యంతరం లేనందున.. అరెస్టు ఉదంతంపై ఎంపీ బుధవారం ట్వీట్ల చేశారు. ‘‘ఈ కష్ట సమయం లో నాకు తోడుగా, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని రఘురామ అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్, ఎమ్మారై స్కాన్తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు. రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. పరీక్షల అనంతరం ఎయిమ్స్ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు చేరుకున్నారు.