కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రస్తుతం నిలిపివేశారని, ప్రస్తుతం నేమ్ ఆడింగ్ (ఒకచోట నుంచి మరోచోటకి పేరు బదిలీ) ప్రక్రియ కూడా కొనసాగడం లేదని దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్ డీసీఎస్వో అధికారి సి. పద్మ, ఇన్చార్జీ అధికారి తనూజ సత్యం న్యూస్కు వివరించారు. ఎంత సమయం పట్టనుందో తమకు పై నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన అనంతరం మీడియాకు ఆయా వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్ పరిధిలో మొత్తం 5 లక్షల 80 వేలకు పైగా రేషన్కార్డులు ఉన్నాయని తనూజ వెల్లడించారు.
రేషన్ కార్డుల జారీ, పేరు నమోదు ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్నవివిధ అనుమానాల నివ్రత్తి కోసం సత్యం న్యూస్ పలువురు ఇంతకుముందు కొత్త రేషన్ కార్డుల జారీ, పేరు నమోదు ప్రక్రియ కోసం పేర్లు నమోదు చేసుకున్న వారిని కదిలించింది. ఈ నేపథ్యంలో పలువురు మీసేవాల్లో ఇప్పటికే దరఖాస్తులు చేసుకోగా.. మీ సేవాల్లో మళ్లీ కొత్త కార్డుల జారీ, పేరు నమోదు ప్రక్రియ జరుగుతోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి డీసీఎస్వోలను సంప్రదించగా ఆయా వివరాలను వారు వెల్లడించారు. లబ్ధిదారులు అనవసరంగా మీసేవాల్లో దరఖాస్తు చేసుకుంటూ.. డబ్బులు ఖర్చు చేస్తూ… ఆయా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇప్పట్లో పని కాదని స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ప్రజలు ద్రుష్టిలో ఉంచుకోవాలి.