వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో టీమిండియా ఘనంగా బోణీ చేసింది. తొలి టెస్ట్లో వెస్టిండీస్ను 318 పరుగులతో చిత్తు చేసింది. భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో భారీ విజయం. ఈ మ్యాచ్ లో రహానె కు తోడు హనుమ విహారి నిలిచి ఉండకపోతే ఫలితం వేరుగా ఉండేది. అయితే….. రహానె, బుమ్రా, ఇషాంత్, షమి పేర్లు మీడియాలో మారుమోగి పోయాయి తప్ప హనుమ విహారి పై ఎవరి ఫోకస్ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు మీడియా దృష్టి హనుమ విహారిపై సోకలేదు. తెలుగు వాడైన హనుమ విహారి ని మీడియా పట్టించుకుని ఉంటే బాగుండేది.
కొంత వెనక్కు వెళితే ఆ కధ వేరు. విహారి విషయంలో అలాగే జరిగింది .’అంగట్లో అన్నీ వున్నా….అనే సామెత గుర్తుకు వస్తుంది. ఏమిటో ..కొందరికి అదృష్టం కలిసి వచ్చినా సరే….అదేమిటో అనుకున్నా లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుకోకుండా బ్రేకులు పడుతుంటాయి. అయితేనేం… ఆలస్యం అయినా అంతిమ లక్ష్యసాధనలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కలిసొస్తాయి.కఠోర శ్రమ..పట్టుదల ..అంకిత భావం ఇవన్నీ కూడా వీటికి తోడైతే..ఇంకేముంది? విజయ విహారం..దుమ్ము దుమారం ! ఈ కోవకు చెందిన వాడే మన భారత క్రికెట్ యువతేజం..హనుమ విహారి. సంచలనాలతో దూసుకుపోతున్నాడు. బౌలింగ్ లో ఆఫ్ స్పిన్ మెళకువలను ఔపోసన పట్టాడు. ఇటు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు.
అండర్ -19 భారత జట్టులో 2012 లో చేరి ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో సత్తా చాటుకున్నాడు. 2018 లో ఇంగ్లాండు జట్టుతో తలపడినప్పుడు టెస్ట్ అరంగేట్రం చేసాడు. కాకినాడలో పుట్టిన హనుమ విహారి గోదావరి ఖనిలో పెరిగాడు. హైదరాబాద్ లో ఆడాడు. అతడికి ఇప్పుడు సరిగ్గా పాతికేళ్లు. డిల్లీ క్యాపిటల్స్..దిండిగల్ డ్రాగన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హనుమ విహారి 2013l లో తొలిసారిగా ఐపిఎల్ లీగ్లో సన్ రైజర్స్ జట్టులో ఆడాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం కు ఆడిన క్రిస్ గేల్ ను ఒక్క బంతికే క్రీజ్ వెనక్కు పంపాడు.
భిన్నమైన వాతావరణంలో విభిన్న శైలిలో ఆడగలిగే క్రికెటర్ ప్రస్తుతం ఎవరైనా వున్నారా అంటే అప్పుడు హనుమ విహారి పేరే చెప్పవలసి వుంటుంది . . క్రైసిస్ మేనేజ్మెంట్ లో అతడికతడే సాటి !ఆట మొదలైన తర్వాత అతడిని మిడిల్ ఆర్డర్ లోనే పంపాలి తప్ప టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పంపకూడదని ఎప్పుడో డిసైడయిపోయారు.విజయాన్ని సొంతం చేసుకోవాలనుకుని ఏ కెప్టెన్ అనుకోడు? హనుమ విహారి వుంటే అంత నిశ్చింత మరి! విజృంభణ కు మారు పదం హనుమ విహారి.అటు బ్యాట్ తోను..ఇటు బాల్ తోను హనుమంతుడి మాదిరిగా చెలరేగిపోతాడు. భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదించడమే తన ముందున్న లక్ష్యమని తెలుగుతేజం హనుమ విహారి అంటున్నాడు.
తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే తాను చేస్తానని అంటున్నాడు. స్వతహాగా ఆఫ్ స్పిన్నర్ అయిన విహారి ఇక బౌలింగ్ను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి సారిస్తానని అన్నాడు. ‘ నా ఆఫ్ స్పిన్ బౌలింగ్ను మరింత మెరుగుపరుచుకోవాలి. బౌలింగ్లో ఆడపదడపా బౌలింగ్ కాకుండా రెగ్యులర్ బౌలింగ్ ఆప్షన్ కావాలి. అదే నా లక్ష్యం. టీమిండియా క్రికెట్ జట్టులో ఐదో బౌలింగ్ ఆప్షన్గా స్థిరపడాలనుకుంటున్నా. ఐదో బౌలింగ్ ఆప్షన్లో నేను ఫిట్ కావాలనుకుంటున్నా.
అయితే బౌలింగ్కు బాగా పదును పెట్టాల్సి ఉంది. నేను సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు వేస్తే అది జట్టుకు ఉపయోగపడాలనేది కోరిక. అందుకోసం నా ఆఫ్ స్పిన్లో రాటుదేలాలి. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లు ఎందరో ఉన్నారు. వారి నుంచి పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా’ అని విహారి పేర్కొన్నాడు.