www.weaversdirect.in వెబ్ సైట్ ఆరంభించిన నారా లోకేష్
చేనేతల తలరాత మార్చేందుకు యువనేత నారా లోకేష్ వేసిన తొలి అడుగు లక్షలాది చేనేతల భవితకి బాట కానున్నది. నారా లోకేష్ అనే ఒక వ్యక్తి తన ఆలోచనలని ఆచరణలో పెట్టడం ద్వారా లక్షలాది మందిని ముందుకు నడిపించే చోదక శక్తిగా నిలిచారు. మంగళగిరిలో చేనేతల కోసం యువనేత మదిలో మొగ్గ తొడిగిన ఆలోచన వెంకటగిరిలో www.weaversdirect.in రూపంలో అందుబాటులోకి వచ్చింది. చేనేతల భవితకి బంగారుబాటగా మారే ఈ ప్రాజెక్టు రూపకల్పనకి నారా లోకేష్ కర్త, కర్మ, క్రియ. చేనేతల బతుకుల్లో వెలుగులు నింపేందుకు మహాయజ్ఞంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకి సహాయ సహకారాలు అందించిన ఎన్ఆర్ఐలు శాంతి నరిశెట్టి (లాస్ ఏంజెల్స్), మాధవి మార్త (ఛార్లెట్టె), అనూరాధ (న్యూజెర్సీ)లకి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
మంగళగిరి మన లోకేష్ అని నినదిస్తోంది. ప్రతి పల్లె, ప్రతి ఇల్లూ లోకేష్ సాయం పొందుతోంది. తన నియోజకవర్గంలో 30,000 మందికి పైగా చేనేత కార్మికులున్నారు. పర్యటనల సందర్భంలో చేనేత కార్మికులు, డై వర్కర్స్ తో లోకేష్ మాట్లాడేవారు. వారి సమస్యలు ఆకళింపు చేసుకున్నారు. అడ్డంకులేంటో అవగాహనలోకి వచ్చాయి. పాలసీ మార్చితే సరిపోదు, సమూలంగా వ్యవస్థలో మార్పులు తేవాలని నిర్ణయించుకున్నారు. క్షేత్రస్థాయిలో చేనేతలతో మాట్లాడినవి, ఆయారంగాల నిపుణులతో చర్చించినవి, మార్కెటింగ్ అవకాశాలు పరిశీలించినవి అన్నీ అధ్యయనం చేసిన తరువాత ఓ ప్రణాళిక రూపొందించారు.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ప్రభుత్వ-ప్రైవేటు-స్వయం ఉపాధి రంగాల ద్వారా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వాల తీరుతో వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధినిస్తోన్న చేనేత రంగం రోజురోజుకీ సంక్షోభంలో చిక్కుకుంటోంది. దీనిపై ఆధారపడిన 5 లక్షల మంది ఈ వృత్తిని వీడే ప్రమాదం ఉంది. చేనేత సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన లోకేష్ వారికి చేయూతనందించే ప్రణాళిక రూపొందించి పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నుంచి ఆరంభించారు. ఇది విజయవంతమైతే రాష్ట్రంలో 5 లక్షల మంది చేనేతలకి మెరుగైన జీవన ప్రమాణాలతో అదే వృత్తి ద్వారా స్వయం ఉపాధి కల్పించే అద్భుత అవకాశం ఉంది.
లోకేష్ చేపట్టిన ప్రాజెక్టులో ముఖ్యాంశాలు
చేనేత కార్మికులు సాంప్రదాయ పద్ధతిలో రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. వీరికి కొత్త టెక్నాలజీ వాడడం నేర్పి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 30 శాతం ఉత్పత్తి పెరిగింది. హైస్పీడ్ చరఖా, రాక్ లూమ్స్, మెకానికల్ లిఫ్టర్స్ వంటివి కార్మికులు వాడటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు తక్కువ గంటల్లో ఎక్కువ ఉత్పత్తి సాధించగలుగుతున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేయడం వల్ల డైయింగ్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి రక్షణ కోసం ప్రత్యేకమైన గ్లోవ్స్, బూట్లు లోకేష్ సరఫరా చేశారు. కేంద్రప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వీవర్ రిసోర్స్ సెంటర్ ద్వారా కొన్ని పనిముట్లు అందజేస్తే, ప్రమాదకరమైన రసాయనాలు-రంగుల నుంచి కార్మికులకి కొంత రక్షణ లభిస్తుంది.
రోజులకొద్దీ ఇంటిల్లిపాదీ కష్టపడి నేసిన చీరలు, వస్త్రాలు దళారుల చేతికి చిక్కుతున్నాయి. దీంతో లాభాలు రావడంలేదు. చేనేతల్ని దోచుకునే మధ్య దళారీలకి చెక్ పెట్టి నేరుగా తాము నేసిన చీరలు, వస్త్రాలు తామే అమ్ముకునేలా కొన్ని కార్పొరేట్ సంస్థలతో టై అప్ కుదిర్చారు. ప్రపంచంలో ఏ మూలనుంచైనా మంగళగిరి చీరలు, వస్త్రాలు ఆన్ లైన్లో ఆర్డర్ చేయొచ్చు. వచ్చే లాభం నేరుగా చేనేతలకే చేరుతుంది. చేనేత ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేర్చే వెబ్సైట్ www.weaversdirect.in. లోకేష్ తన బృందంతో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆధునిక కాలంలో అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలు తయారు చేసేందుకు ముందుగా శిక్షణ ఇచ్చేలా ఒక అధునాతనమైన శిక్షణాకేంద్రం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ రూపొందిస్తున్నారు. న్యూ టెక్నాలజీ, మోడ్రన్ డిజైన్స్ తయారు చేసి చేనేత ఉత్పత్తులకి ప్రపంచస్థాయి బ్రాండ్ క్రియేట్ చేయాలని యోచిస్తున్నారు. చీరల అమ్మకాలు 20 శాతమైతే, గార్మెంట్స్ 50 శాతం అమ్మకాలు సాగుతున్నాయి. అందుకే గార్మెంట్స్ తయారీలోనూ చేనేతలకి శిక్షణ ఇప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
వెబ్సైట్ ప్రారంభ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి లో అనుసరిస్తున్న మోడల్ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇదే ప్రణాళిక అమలు చేస్తామని అన్నారు. వెంకటగిరి లో కూడా చేనేత రంగానికి ఎంతో మంది దూరం అవుతున్నారు. వారందరినీ మళ్ళీ చేనేత వృత్తి వైపు వచ్చేలా చెయ్యడమే నా లక్ష్యం అని లోకేష్ అన్నారు.