విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేస్తున్నట్లుగా అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక, ఆదేశాలతో రాత్రి బీట్లును, పుట్ పెట్రోలింగ్ ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామన్నారు.
సబ్ డివిజన్ పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ అనిల్ పుటిపాటి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రోజూ రాత్రి బీట్లును ఒకే విధంగా కాకుండా బీట్ ప్రాంతాలను, సమయాలను మార్పులు చేస్తున్నామన్నారు. బీటు పరిధిలో నివసించే హిస్టరీ షీటు కలిగిన వ్యక్తుల ఫొటోలను తప్పనిసరిగా బీట్ పుస్తకంలో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.
బీట్ తనిఖీలను కనీసం మూడు సార్లు రాత్రి సమయంలో చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీట్ పరిధిలో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు పాయింట్ పుస్తకాలను కూడా పెంచాలని నిర్ణయించామన్నారు.
విజయనగరం పట్టణ పరిధిలో షాపులు, ఏటిఎమ్ ల వద్ద నిఘా పెంచడంలో భాగంగా పట్టణంలో ఇకపై ప్రతీ రోజూ రెండు పుట్ పెట్రోలింగ్ బీట్లును కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తామని అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి తెలిపారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో వన్ టౌన్ ఇన్ ఛార్జ్ సీఐ సిహెచ్. శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, రూరల్ సీఐ మంగవేణి, ఎస్.కోట సీఐ సింహాద్రినాయుడు, కొత్తవలస సిఐ బాలసూర్యారావు, భోగాపురం సీఐ విజయనాధ్ సబ్ డివిజన్ ఎస్ ఐలు పాల్గొన్నారు.