రాష్ట్రంలో కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, మార్గదర్శకాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందిగా అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఆంక్షల నేపథ్యంలో ప్రజలు స్వయ నియంత్రణ పాటిస్తూ పోలీసుల సహకారించాలని సూచించారు.
కరోనా ఉధృతి సమర్థవంతంగా నియంత్రించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, ఫార్మసీలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా,టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు, ప్రసార మరియు కేబుల్ సేవలు, ఐటి సంస్థల సేవలు, ఇ-కామర్స్ ద్వారా వస్తువుల పంపిణీ, పెట్రోల్ పంపులు, ఎల్పిజి, సిఎన్జి, పెట్రోలియం, గ్యాస్ అవుట్లెట్లు, విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం మరియు పంపిణీ,నీటి సరఫరా మరియు పారిశుధ్యం, కోల్డ్ స్టోరేజ్ మరియు గిడ్డంగి సేవలు, ప్రైవేట్ భద్రతా సేవలు, నిరంతర ప్రక్రియ అవసరమయ్యే ఉత్పత్తి యూనిట్లతో పాటు ఆయా కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులు, అత్యవసర సర్వీసులు కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
రాత్రి పూట 9-00 గంటల నుంచి ఉదయం 5-00 గంటల వరకు కర్ఫ్యూ అమలు సమయాలలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వ్యాపార, వాణిజ్య సంస్థలు, షాపింగ్మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లను రాత్రి 8-00 లోగా మూసివేయాలని, రాత్రి 9-00 గంటల తర్వాత కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు.
కర్ఫ్యూ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది విధిగా తప్పనిసరిగా ఐడీ కార్డులను చూపాలని ఆయన కోరారు. అదే సమయంలో ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు వ్యాలిడ్ టికెట్లను దగ్గర ఉంచుకొని కర్ఫ్యూ సమయంలో వాటిని చూపించాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్ రాష్ట్ర సర్వీసులు, రాష్ట్ర గూడ్స్ సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించి కరోనా కట్టడికి కలిసి రావాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.