తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిందని జిల్లా కలెక్టర్ శర్మన్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా లోను ఏప్రిల్ 30 వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రజలందరూ గమనించాలని కలెక్టర్ సూచించారు.
నేటి నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందన్నారు. అయితే, అత్యవసర సేవలకు దీని నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వుల జీవో ఎంఎస్ నెంబర్ 87ను జారీ చేసిందని తెలిపారు. నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలను అమలు పరచాలన్నారు.
ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంటుందని తెలిపారు. నైట్ కర్ఫ్యూలో భాగంగా.. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్లు, మందుల దుకాణాలు, అత్యవసర సేవలందించేవాటికి మినహాయింపు ఉంది.
మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.
విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది. గర్భిణీలు, రోగులు మెడికల్ సేవలు పొందవచ్చు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని జిల్లా కలెక్టర్ శర్మన్ తెలిపారు.
ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.