నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లలో కారకులైన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని వీధుల్లో పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల ఏర్పడిన ఘర్షణల్లో ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదని పోలీసు బందోబస్తు ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉండడం మళ్లీ బందోబస్తు ఎత్తివేసిన తర్వాత అల్లర్లకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఘర్షణలకు దిగడం వల్ల ఇరువర్గాల వారు నష్టపోతున్నారని ఆయన అన్నారు.
కేసుల్లో ఇరుక్కుంటే మీకు భవిష్యత్తు ఉండదు
దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుస సంఘటనల వల్ల బైంసా పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని అలాగే యువత కేసుల్లో ఇరుక్కుని జైలు పాలైతే వారి భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు.
వీటిని దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతియుత వాతావరణం నెలకొనెలా సహకరించాలని కోరారు. ఎవరికివారు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పండగలను శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని హితవు పలికారు.
పీడీయాక్ట్ నమోదు చేస్తే బెయిల్ కూడా రాదు
లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని అనవసరంగా రోడ్లపైకి వచ్చి లాక్ డౌన్ ఉల్లంఘన కేసులో ఇరుక్కోవడం హితవు పలికారు. పదేపదే కేసుల్లో పీడీ యాక్ట్ లో సైతం కేసులు నమోదు చేస్తామని, వారికి సంవత్సరం పాటు బెయిలు కూడా లభించదని తెలిపారు. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంవల్ల ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని ప్రజలు పుకార్లను ఆందోళనకు గురికావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, భైంసా డిఎస్పీ నర్సింగ్ రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.