ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ రూపొందించేందుకు ముందుకు కదులుతున్నమోడీ ప్రభుత్వం 10 బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ను విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ గా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్గా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ను కలిపి ఐదో అతిపెద్ద బ్యాంక్గా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్ను అలహాబాద్ బ్యాంక్లో విలీనం చేస్తున్నట్లు కూడా ఆమె చెప్పారు. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నది. బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న అనేక సంస్కరణలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్షిస్తున్నాయని, రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయని ఆర్ధిక మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని అందువల్ల నీరవ్ మోదీ లాంటి ఉదంతాలు మరోసారి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బ్యాంకులకు గ్లోబల్ ఫోకస్ ఉండటానికి పెద్ద బ్యాంకుల అవసరం ఉందని ఆమె అన్నారు.
previous post
next post