నివర్.. తుఫాన్ బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప జిల్లాలో వేలాది ఎకరాల్లో చేతికి వచ్చిన వరి పంట పూర్తిస్థాయిలో దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షానికి దెబ్బ తిన్నపంటపొలాలు ప్రభుత్వం అంచనా వేసి రైతులను ఆదుకోవాలన్నారు. వరితో పాటు నియోజకవర్గంలో ప్రధాన పంట అయిన టమోటా ఇతర కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం వీటిపై సానుకూలంగా స్పందించి రైతన్నలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలో పలు చెరువులు కుంటలు దెబ్బతిన్నాయని వీటిని మరమ్మతులు చేసి నీటిని నిల్వవుండేలా చూడాలన్నారు.
రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే రహదారులను మర్మతులు చేయాలని, జిల్లాలో ఎక్కడైనా కరెంటు లైన్ లు తెగిపడిన లేదా విరిగిపడిన స్తంభాలకు సంబంధించి విద్యుత్ అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వారం రోజులు ముందుగానే తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలను కేంద్రం చేసినప్పటికీ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వదిలి రైతులను తుపాను బాధితులను వెంటనే ఆదుకొని చర్యలు చేపట్టాలన్నారు.
రాయచోటి, రాజంపేట రైల్వేకోడూరులో వర్షంపాతం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని, పోలీసులు కూడా వాగులు వంకలు ఇతర నీరు నిల్వ ఉన్నప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉందని, కంట్రోల్ రూమ్, ఇతర ఫోన్ సదుపాయం కల్పించి ఎప్పటికప్పుడు అధికారులు ప్రతి మండలంలో అందుబాటులో ఉండి ప్రజలను రక్షించాలని కోరారు.