బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎలాంటి దాడి జరగలేదని సెంట్రల్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ పి విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. బండి సంజయ్ పై దాడి జరిగినట్లు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు.
రాత్రి 8.50 నిమిషాలకు బండి సంజయ్ నక్లెస్ రోడ్డులో ఈవినింగ్ వాక్ కు వచ్చారని ఆయన తెలిపారు. ఈ విషయం గమనించిన పోలీసులు ఆయన వద్దకు వచ్చి వంటరిగా రోడ్డుపై తిరగవద్దని, ఇలా ఏకాంతంగా రోడ్డుపైకి రావడం మంచిది కాదని చెప్పినట్లు విశ్వప్రసాద్ వివరించారు.
అయితే తాను నక్లెస్ రోడ్డులోని ఈట్ స్ట్రీట్ లో టిఫిన్ చేసిన తర్వాత వెళతానని బండి సంజయ్ పోలీసులకు చెప్పారని ఆయన అన్నారు.
ఆయన టిఫిన్ చేసి వెళ్లిన తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరకున్నారని ఆయన అన్నారు. అప్పటికే బండి సంజయ్ వెళ్లిపోవడంతో వారు కారు అద్దాలు దించి చూశారని, అయితే అక్కడే ఉన్న పోలీసులు మందిని కంట్రోల్ చేశారని విశ్వప్రసాద్ తెలిపారు.
కారులో ఉన్న వ్యక్తులను అక్కడ నుంచి సురక్షితంగా పంపారని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఆయన వివరించారు.