చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఇతర దేశాలకూ పాకుతోంది. ఈ వైరస్ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్లో కరోనా వైరస్పై వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్ధరణ కాలేదని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు పర్యవేక్షిస్తోందన్నారు. కరోనా వైరస్పై బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగరంలోని పలు ఆసుపత్రుల్లో పర్యటిస్తోందని, వైరస్పై వైద్యులకు తగు సూచనలు చేస్తోందని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఈటల పేర్కొన్నారు.