నిజాయితీకి మారుపేరైన చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో న్యాయానికి సంకెళ్లు వేశారని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం విజయనగరం లో నిర్వహించిన “న్యాయానికి సంకెళ్లు” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులతో కలిసి చేతులకు తాళ్లు, రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మరక అంటని ఏకైక నేత చంద్రబాబన్నారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన తాపత్రయమన్నారు.
నేడు ఒక సైకో పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని విమర్శించారు. జగన్ కు ఓటేసి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఏర్పడిందని తెలిపారు. మరలా చంద్రబాబు నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటోందని, ఆ అక్కసుతోనే ఆయన్ను జగన్ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారని గుర్తు చేశారు. జైల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
చంద్రబాబు ఆరోగ్యం పై ఎందుకు నివేదిక విడుదల చేయడం లేదని, ప్రభుత్వానికి ఎందుకు అంత దాపరికమని ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై యావత్ ప్రజానీకం ఆందోళనలో ఉందన్నారు. తక్షణమే జైల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు.