చంద్రబాబునాయుడి భద్రతకు బాధ్యత వహిస్తున్న ఎన్ ఎస్ జి కమెండోల బృందం తీవ్ర చర్యలకు పాల్పడేందుకు అనుమతి తీసుకున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. విశాఖపట్నంలో నిన్న చంద్రబాబునాయుడి కారుపై రాళ్లు చెప్పుల దాడి జరిగిన విషయం తెలిసిందే.
విశాఖ పోలీసులు అక్కడ గుమికూడిన ప్రజలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని అందువల్ల తాము ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఎన్ ఎస్ జి సెక్యూరిటీ సిబ్బంది తమ హెడ్ క్వార్టర్స్ కు సమాచారం పంపినట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో వెంటనే స్పందించిన కేంద్ర హోమ్ శాఖ, రాష్ట్ర డీజీపీ కి ఫోన్ చేసింది. చంద్రబాబు భద్రతపై అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు అందడంతో ఎన్ ఎస్ జి కమెండోలు తదుపరి చర్యలకు దిగినట్లుగా తెలిసింది.
అయితే చంద్రబాబునాయుడు ముందుకు వెళ్లకుండా వెనక్కు తగ్గి విమానాశ్రయంలోనికి వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎన్ ఎస్ జి కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.