సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి కోట్లాది మంది సామాన్యులకు అండగా నిలిచిన మేరు నగధీరుడు నందమూరి తారకరామారావు అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శమన్నారు. ఆయన కృషి, క్రమశిక్షణ పట్టుదల, చిత్తశుద్ధి, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమన్నారు.
ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవా నిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం తరతరాలకు ఆదర్శమని ట్విటర్లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదామని ఆకాంక్షించారు.
‘‘ సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ల’’ని చాటుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. బడుగులకు రాజకీయ అవకాశాలు ఇచ్చిన సమసమాజ వాది , మహిళలకు సమాన హక్కులు కల్పించిన అభ్యుదయ వాది ఎన్టీఆర్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తనవంతు సహకారాన్ని అందించిన ప్రజా బంధువు ఎన్టీఆర్ అని ట్వీట్ చేశారు.