ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్.శర్మన్ కోరారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కనీసం 10 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
మంగళవారం అచ్చంపేట మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో ఉదయం 12 గంటలకు ఏడోవ తరగతి విద్యార్థులకు కొనసాగుతున్న భాగాహారాలు నియమాలు అనే పాఠాన్ని ఏడో తరగతి విద్యార్థి ఎస్ అజయ్ ఇంటికే నేరుగా వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు కూడా పాల్గొన్నారు.
టీచర్లు సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రసారా సమస్యలు లేకుండా అధికారులు చూడాలని కలెక్టర్ కోరారు. యాదగిరి టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న బోధన ప్రక్రియ, విద్యార్థి అజయ్ రాసుకునే అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, పదర, లింగాల, అచంపేట్ ఏజెన్సీ ప్రాంతంలో నెట్ వర్క్ సమస్య ఉన్నా సమయంలో విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులు వినేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి ఉపాధ్యాయుడు పది మంది విద్యార్థులను అడాప్ట్ చేసుకుని ఆన్లైన్ తరగతులను వీక్షించేలా చూడాలన్నారు. ఆన్లైన్లో తరగతులు కొనసాగుతున్న సమయంలో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల్లో వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ ఆన్లైన్ తరగతులను జిల్లాలో విజయవంతంగా కొనసాగించాలని ఆదేశించారు.
ప్రతిరోజు పాఠశాలల పరిధిలోని విద్యార్థులు ఎంతమంది ఆన్లైన్ తరగతులకు హాజరు అయ్యారన్న వివరాలను జిల్లాకు తెలియజేయాలన్నారు. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు ప్రాజెక్టు వర్క్ తో పాటు, అసైన్మెంట్ ఇస్తూ విద్యార్థులకు సబ్జెక్టుల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు.
కలెక్టర్ వెంట సెక్టోరల్ అధికారి మంతటి నారాయణ, తహసిల్దార్ తదితరులు ఉన్నారు.