ఆగస్టు 13వ తేదీన రాజకీయాలకు అతీతంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన కాపు నాయకులతో కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో సభను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు నాయకులు తెలిపారు. ఈ సభలో అందరి అభిప్రాయాలను తీసుకుని ఐక్య కార్యాచరణలను రూపొందిస్తామన్నారు. సోమవారం కాకినాడలోని స్థానికంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వాదా ప్రసాద్, ఉపాధ్యక్షుడు తుమ్మల శ్రీరామమూర్తిలు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రసాద్, శ్రీరామమూర్తిలు మాట్లాడుతూ ఆ రోజున ఆ సభకు 26 జిల్లాలకు చెందిన కాపు నాయకులను రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆహ్వానిస్తామన్నారు. వారందరితో చర్చించి ఏకాభిప్రాయం సాధించి హక్కుల సాధన కోసం ఐక్య భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గాల జనాభా ఉందని అందుకు తగ్గట్టుగా రాజకీయ పార్టీల్లో వాటాను డిమాండ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
అలాగే ఈ సమావేశంలో కుల అభివృద్ధి కోసం అన్యాయం జరుగుతున్న వారికి న్యాయాన్ని అందించేలా తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ ఈ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని కాపు సామాజిక వర్గీయ నేతలంతా సకాలంలో హాజరు కావాలని వాదా, తుమ్మలలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపునాడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వారు వివరించారు. అనంతరం ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ విలేకరుల సమావేశంలో కాపు సంఘ నాయకులు జానపాముల నాగబాబు, గాదంశెట్టి కొండలరావు, దలే జ్యోతి, జొన్నపల్లి సత్యనారాయణ, సలాది శ్రీనివాస్, ఆకుల రమేష్, తిరుమలశెట్టి మురళి శ్రీను, యర్రంశెట్టి రామరాజు తదితరులు పాల్గొన్నారు.