ఆసుపత్రికి వెళ్తుండగా లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఒకరి ప్రాణాలను తీసింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్ లో ఈ దుర్ఘటన జరిగింది.
మోటర్ సైకిల్ పై వెళ్తున్న భార్యభర్తలు జీను నాగేశ్వరావు (57), జీను వెంకటలక్ష్మి (50) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. భార్య వెంకటలక్ష్మి అక్కడికక్కడే మరణించారు.
కొవ్వూరు అచ్చాయమ్మ కాలనికి చెందిన జీను నాగేశ్వరరావు భార్య జీను వెంకటలక్ష్మి ఇద్దరు మోటర్ సైకిల్ పై హోమియోపతి చికిత్స నిమిత్తం నిడదవోలు వెళుతున్నారు.
వారిని వెనక నుండి క్వారీ లారీ ఢీకొన్నది. భార్య మృతి చెందగా భర్త కు తీవ్రగాయాలు తగిలాయి.
ఆయన కుడికాలు విరిగి రక్తం కారుతున్నా కూడా తన భార్య మృతి చెందిన విషయం తెలియక తన భార్యకి ఎలా ఉందో చెప్పండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలు చూపరులని కంటి తడిపెటించాయి.
సంఘటన స్థలం నుంచి లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. విషయం తెలుసుకున్న నిడదవోలు ఎస్ఐ జగదీశ్వరావు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు నాగేశ్వరావు ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.