రాష్ట్రంలో నూరు శాతం జనన,మరణాల నమోదు(రిజిస్ట్రేషన్) జరిగేలా గ్రామ పంచాయితీలు,మున్సిపాలిటీలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. ఆధార్ అనుసంధానిత జనన మరణ ధృవీకరణ అంశంపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జనన మరణాలకు సంబంధించిన ఆయా వివరాల నమోదు ప్రక్రియను గ్రామ పంచాయితీలు,మున్సిపాలిటీలు చేస్తున్నాయని వాటిని మరింత పటిష్టవంతంగా చేపట్టి నూరు శాతం జనన మరణాలను నమోదు చేయాలని పునరుద్ఘాటించారు.
వైద్య ఆరోగ్యశాఖ,మహిళా శిశు సంక్షేమం,విద్యాశాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న రోజుల్లో ఆధార్ అనుసంధానిత జనన మరణ ధృవీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించి త్వరలో ప్రత్యేక సాప్ట్ వేర్ కూడా అందుబాటులోకి తీసుకురాన్నారని తెలిపారు.
కావున నూరు శాతం జనన,మరణాల నమోదు(రిజిస్ట్రేషన్)కు సంబంధించి గ్రామ పంచాయితీలు,మున్సిపాలిటీలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను సిఎస్.డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.
ప్రస్తుతం జరుగుతున్నజనన మరణాల నమోదు ప్రక్రియ ఏవిధంగా జరుగుతుంది ఆయన అధికారులను అడిగి తెల్సుకున్నారు. ఇంకా ఈసమావేశంలో అనేక అంశాలపై ప్రాధమికంగా అధికారులతో చర్చించారు. వచ్చే సమావేశంలో పూర్తి స్థాయిలో ఈఅంశపై చర్చించి కార్యాచరణ అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్.చెప్పారు.
ఈసమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు.ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది,బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సిడిఎంఏ కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొనగా దృశ్యమాద్యం ద్వారా యుఐడిఎఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.