అవసరానికి డబ్బులు అప్పు ఇస్తే తిరిగి ఇవ్వాలి. లేదా తర్వాత ఇస్తానని చెప్పాలి. మరి ఇతనేంటో అప్పు ఇచ్చిన వాడ్ని కత్తులతో పొడిచేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల లో ఈ వింత సంఘటన జరిగింది. కంచికచర్ల పట్టణానికి చెందిన శ్రీకాంత్ (26) అదే పట్టణానికి చెందిన ఉపేంద్ర కు డబ్బులు అప్పుగా ఇచ్చాడట. ఆ డబ్బు అతను ఎంతకూ తీర్చడంలేదు. దాంతో ఉపేంద్ర ఆచూకీ కోసం శ్రీకాంత్ వెతుకుతున్నాడు. మధ్యవర్తికి ఇదే విషయం చెప్పగా మధ్యవర్తి ఉపేంద్ర ఆచూకీ తెలిపాడు. దాంతో శ్రీకాంత్ అక్కడకు వెళ్లాడు. శ్రీకాంత్ ను చూడగానే ఒక్కసారిగా ఉపేంద్ర ఆగ్రహం తో కత్తితో పీక కోసి చేతులు కాళ్ళు వెన్నుపూస మీద కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీకాంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని స్థానికుల సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.