ఉల్లి వినియోగదారులకు శుభవార్త. గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో ఉల్లి పంట చేతికి వచ్చేసింది. ఈ కారణంగా రానున్న పది రోజులలో ఉల్లిపాయల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పుడు ఉన్న ధరలో దాదాపు 50 శాతం మేరకు ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉంది.
అంటే కిలో 50 నుంచి 70 రూపాయలకు చేరవచ్చు. మూడు రాష్ట్రాలలో పంట వచ్చేసినందున త్వరలో సమృద్ధిగా ఉల్లిపాయలు మార్కెట్లలోకి రానున్నాయి. గత కొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో ఉల్లి ధరల పెంపుపై నిరసనలు వెల్లువెత్తాయి. ధరల పెరుగుదల చాలా మంది జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. ఉల్లి మధ్య దిగువతరగతి, దిగువ తరగతి ప్రజల ముఖ్య ఆహారం అయినందున అనేక మంది జీవితాలపై ఉల్లి ధర పెరుగుదల ప్రభావం చూపించింది.
కిలో 200 రూపాయల వరకూ చేరినా కూడా ఉల్లి రైతుకు మాత్రం ఎలాంటి లాభం రాలేదని ఒక పరిశీలనలో వెల్లడైంది. అంటే ఈ లాభం అంతా బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన ఉల్లి దళారులకే చేరింది. పెద్ద మొత్తంలో పంటలను నిల్వ చేయడానికి అందుబాటులో స్థలం లేనందు వల్లే రైతులు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తున్నది.
ఉల్లిని ఎక్కువ కాలం నిల్వ చేసే సాంకేతిక విషయాలు కూడా మన దేశంలో అందుబాలులో లేవు. ఈ విషయంపై ఇప్పటి నుంచి శ్రద్ధ చూపిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వెల్లడించారు.