తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సాంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన లేకుండా వ్యాఖ్యానాలు చేస్తున్నారని కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.
సాంప్రదాయాలపై అవగాహన లేకపోయినా, తిరుమల శ్రీవారిపై నమ్మకం లేకపోయినా ఆ పదవిలో ఉండాల్సిన అవసరం లేదని మాడభూషి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన వై వీ సుబ్బారెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అనడం అసంబద్దమైనదని మాడభూషి శ్రీధర్ అన్నారు.
స్వామివారిపై మీకు నమ్మకం ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా మీరు ప్రకటించాలి అని ఆయన కోరారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తిరుమలకు వచ్చినపుడు డిక్లరేషన్ విషయం తెలుసుకుని ఆయన ఆ పుస్తకం తెచ్చేవరకు ఆగి అందులో సంతకం చేశారని మాడభూషి శ్రీధర్ తెలిపారు.
ఆ తర్వాతే ఆయన దేవదేవుడి దర్శనం చేసుకున్నారని శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేసిన నిసార్ అహ్మద్ కక్రూ కూడా డిక్లరేషన్, సాంప్రదాయం తదితర విషయాలను తెలుసుకుని దైవ దర్శనం చేసుకోకుండానే వెనక్కి వచ్చేశారని శ్రీధర్ గుర్తు చేశారు.