గుంటూరు సర్వజన ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం వైద్యులు ఒక రోగికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. న్యూరో సర్జరీ రెండో విభాగం అధిపతి ప్రొఫెసర్ డి.శేషాద్రిశేఖర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లు భవనం హనుమ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఆకాష్, డాక్టర్ వలి , మత్తు వైద్యులు డాక్టర్ భీమేశ్వర రావు, డాక్టర్ పొలయ్య, లు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి సంబంధించి వివరాలను వైద్యులు శేషాద్రి శేఖర్, హనుమ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలిపారు.
గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరనికోటకు చెందిన కోరంపల్లి సూరిబాబు, సరస్వతి దంపతులు వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 23 ఏళ్ల కుమారుడైన బిటెక్ విద్యార్థి బి అనిల్ కుమార్ కు అరుదైన జబ్బు సోకింది. 2018 లో కళాశాలకు వెళ్లే క్రమంలో బస్సు ఎక్కుతున్న సమయంలో కాళ్ళ లో తేడా కనపడింది.
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీన్ని మొదట్లో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. రాను రాను నడక లో తేడా బాగా కనపడే సరికి గుంటూరు తో పాటు చెన్నై ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. లాభం లేకుండా పోయింది. దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టారు. వెన్నుపూస లో కొవ్వు చేరడం వల్ల జబ్బు ముదిరిపాకన పడింది. దీనివల్ల కాళ్ళు చచ్చుపడిపోయి కదలలేని స్థితిలో ఉండిపోతారు.
ఈ కొవ్వు గడ్డగా మారడంతో కాళ్ళు కదలలేని స్థితిలో ఉండిపోయాయి. వెన్నుపూస పై వత్తిడి వల్ల కాళ్ళపై ఆ ప్రభావం కనపడుతుంది. సహజంగా ఇలాంటి జబ్బు చాలా అరుదుగా వస్తుంటుంది.
ఇతను 2021 జనవరి నుంచి పూర్తిగా కదలలేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయిన ఫలితం కనిపించలేదు. చివరకు జీవన ఆధారమైన పొలాన్ని సైతం అమ్మి తమ బిడ్డను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేసారు.
చివరి ప్రయత్నంలో గుంటూరు జిజిహెచ్ కు ఈ ఏడాది ఎప్రిల్ లో రోగిని చేర్పించారు. ఆసుపత్రిలో చేరిన రోగికి వైద్య పరీక్షలు చేశారు. పరీక్షలు చేసిన తర్వాత అరుదైన జబ్బుగా న్యూరో సర్జరీ విభాగం వైద్యులు గుర్తించారు. ఈ జబ్బును స్పైనల్ ఎపిడ్యూరల్ లైసోమేటాసిస్ గా పిలుస్తారు.
వెన్నుపూస ఒత్తిడికి గురికావడం తో మూడో ఎముక భుజం నుంచి కాళ్ళ పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కాళ్ళు కదలలేని స్థితిలో ఉండిపోయి జీవితకాలం బెడ్ పై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాధారణంగా ఇలాంటి వ్యాధి వచ్చిన 24 గంటల్లోగాని ఒక వారంలో చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుంది.
మూడు నెలల తర్వాత జిజిహెచ్ కు రావడంతో వైద్యులకు ఈ జబ్బు ఒక సవాల్ గా మారింది. రోగికి పరీక్షలన్ని చేసి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే రోగికి కరోన రావడంతో మందులు ఇచ్చి ఇంటికి పంపారు.
రోగికి కరోన లక్షణాలు లేకపోవడంతో ఈ నెల 2 వ తేదీన తిరిగి జిజిహెచ్ లో చేరారు. ఈ నెల 13 వ తేదీన శస్త్ర చికిత్స చేశారు. వెన్నుపూస చుట్టూ ఉన్న కొవ్వు గడ్డను తీసివేసి విజయవంతం గా శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత రోగి కాళ్ల లో కదలిక రావడంతో వైద్య శాస్త్రంలో ఇది అరుదైన ఘట్టంగా చెప్పవచ్చని వారు తెలిపారు. ప్రస్తుతం రోగి కాళ్ళను ముడుచుకునే విధంగా కూర్చుంటున్నాడు.
మరో మూడు నాలుగు నెలల్లో నడిచే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో ఈ తరహా జబ్బుకు శస్త్ర చికిత్స చేయడం తొలిసారిగా చెప్పవచ్చని వారు గర్వంగా చెప్పారు. గుంటూరు ప్రభుత్వ వైద్యులు పునర్జన్మ ఇచ్చారని అనిల్ కుమార్ తెలిపారు. తనను విజయవంతం గా శస్త్ర చికిత్స చేసి శుక్రవారం డిశ్చార్జ్ చేసారని ఆయన తెలిపారు.
శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో ప్రతిభ కనబర్చిన న్యూరో సర్జరీ వైద్య బృందానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాబులాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందనలు తెలిపారు.