వాయిదాల మీద వాయిదాల పడుతున్న ప్రతిపక్షాల కూటమి సమావేశం రేపు బెంగళూరులో జరగనున్నది. జూన్ 23న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 18 పార్టీలు హాజరు కావాల్సి ఉండగా 15 పార్టీలే హాజరయ్యాయి. తర్వాత సిమ్లాలో జూలై 10-11 తేదీలలో తదుపరి సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఆ రోజుల్లో సమావేశం జరగలేదు. ఆ తర్వాత ప్రతిపక్షాల సమావేశం బెంగళూరులో 13-14 తేదీలలో జరుగుతుందని ప్రకటించినా ఆ రోజుల్లో కూడా సమావేశం జరగలేదు. ఇప్పుడు 17-18 తేదీల్లో బెంగళూరులో సమావేశం జరుగుతోంది. పాట్నా సమావేశంలో ప్రతిపక్షాల ఐక్య కూటమి పేరును ప్రకటించలేదు.
సమావేశం ముగిసిన రెండు రోజుల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ, బిజెపి వ్యతిరేక పార్టీల తదుపరి సమావేశంలో పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ (పిడిఎ) పేరును ఖరారు చేయవచ్చునని చెప్పారు. అయితే పేరులోనే దేశభక్తి అనే పదం రావాలని కొన్ని పక్షాలు సూచించాయి. నితీష్ ను ఈ కూటమికి సమన్వయకర్తగా ప్రకటించాల్సి ఉన్నా ఆ పని చేయలేకపోయారు.
విపక్షాల ఐక్య ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన నితీష్ కుమార్, ఇందుకు ముఖ్య నేతలను పిలిపించిన లాలూ ప్రసాద్ యాదవ్ బెంగళూరు వెళ్తున్నారు. పాట్నా నుంచి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ నుంచి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ విపక్షాల ఐక్య సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరారు. యుపిఏ పేరును రద్దు చేసేందుకు కాంగ్రెస్ పెద్దగా విభేదించకుండా తాము చూస్తామని కొందరు నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.