నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడా గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడతారనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని అన్నారు.
గతం కంటే రెట్టింపుగా దాదాపు 6,800 కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతుందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో 310 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు 547 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో 74 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు 109 కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతు క్షేమం కోసం ఆలోచిస్తారని, గ్రామాల్లోనే చివరి కిలో వరకు కొంటాం.. రైతులు కూడా తమ వంతు వచ్చేవరకు ఓపిక పట్టాలని మంత్రి కోరారు. కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటిస్తూ రైతులు సహకరించాలని మంత్రి కోరారు.