అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ విజయం సాధించడంపై పాకిస్తాన్ లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్తాన్ కు అత్యంత సన్నిహితుడైన మిత్రుడుగా ఇంతకాలం ఉన్న జో బైడెన్ అమెరికా లో అత్యున్నత రాజకీయ పీఠం అధిరోహించడం పాకిస్తాన్ కు ఎంతో మేలు చేస్తుందని పాకిస్తాన్ పత్రికలు వ్యాసాలు రాశాయి.
చైనా భయం చూపించి డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు ఆయుధాలు సరఫరా చేశాడని, ఇండియాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నాడని పాకిస్తాన్ పత్రికలు అభిప్రాయపడ్డాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏకపక్షంగా ఆర్టికల్ 370ని రద్దు చేసినా కూడా డోనాల్డ్ ట్రంప్ స్పందించలేదని పాకిస్తాన్ ఆరోపిస్తున్నది.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పాకిస్తాన్ భావిస్తున్నది. జోబైడెన్ పాకిస్తాన్ కు ఆర్ధిక సాయం చేసేందుకు రూపొందించిన బిల్లును రూపొందించిన వ్యక్తి.
ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా యుద్ధం చేసే సమయంలో జో బైడెన్ కారణంగానే పాకిస్తాన్ అమెరికాకు సాయం చేసిందని పాకిస్తాన్ గుర్తు తెచ్చుకుంటున్నది. జో బైడెన్ వైఖరి కారణంగానే పాకిస్తాన్ అమెరికాకు పూర్తిగా సహకరించిందని పాకిస్తాన్ తెలిపింది.