నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రకటించిన సందర్భంగా జరుగుతున్న పల్నాటి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన పొట్టేళ్ల పోటీలు ఆసక్తికరంగా కొనసాగాయి. పొట్టేళ్ల పోటీల ప్రారంభానికి విచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజక వర్గ శాసనసభ్యులు మద్దాలి గిరిధర్, లక్కీరెడ్డి బాలిరెడ్డి కళాశాలల అధినేత డా. లక్కిరెడ్డి హనిమి రెడ్డి కి, కల్పతరువు చిట్స్ అధినేతల లంకా రఘురామిరెడ్డి కి శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘన స్వాగతం పలికారు. జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోటీలను తిలకించేందుకు జనం భారీఎత్తున తరలివచ్చారు. మైదానం జనంతో కిక్కిరిసిపోయింది. జనం నుంచి కేరింతల నడుమ రెట్టించిన ఉత్సాహంతో పొట్టేళ్లు తలపడ్డాయి. రెండు పళ్ల విభాగంలో గెలుపొందిన ఎడ్ల జతల యజమానులకు బహుమతులు ప్రధానం చేశారు. మరోవైపు నిర్విరామంగా సాగుతున్న ఒంగోలు జాతి వృషభరాజాల బండ లాగుడు బల ప్రదర్శన పోటీలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బండ లాగుతూ రంకేలేస్తున్న ఒంగోలు గిత్తలను చూసేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి రైతు సోదరులు భారీగా తరలివచ్చారు.