ఏపీకి ప్రాణవాయువులాంటి ప్రత్యేక హోదా ఇవ్వబోమని మోదీ తేల్చి చెబుతున్నా నోరెత్తలేని స్థితిలో వైసీపీ వుందని మాజీ కేంద్రమంత్రి, తిరుపతి లోక్ సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలను మోసం చేసిందదని, ఇలాంటి పరిస్థితులలో కేంద్ర పై యుద్ధం చేయాలంటే ప్రశ్నించే గొంతు కావాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.
తనను ఎంపీగా గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు తిరుపతి అభివృద్ధి కోసం పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. తిరుపతి నగర పరిధిలోని తిమ్మినాయుడుపాళెం హరిజనవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మళ్లీ వైసీపీ ఎంపీని గెలిపిస్తే అభివృద్ధి ఉండదని, హోదా రాదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.
మహిళలపై 22నెలల్లో 8శాతం నేరాలు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్ అభివృద్ధి, మన్నవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు ప్రాజెక్టులన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, ఏమాత్రం అభివృద్ధి ముందుకు సాగలేదని ఆమె అన్నారు.
దుగరాజపట్నం పోర్టు, విశాఖ ఉక్కు, రైల్వే జోన్, అమరావతి రాజధాని వంటి ఎన్నో అంశాలు విభజన చట్టంలో ఉన్నా వాటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని ఈ తరుణంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడి తో కేంద్రం పై, పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతును అవుతాను అని ఆమె వెల్లడించారు.
మీ బిడ్డగా, కోడలి గా ఒక్క అవకాశం ఇవ్వాలి అని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, తిరుపతి టీడీపీ పార్లమెంట్ ఇంచార్జి నరసింహయాదవ్, శ్రీధరవర్మ, మబ్బు దేవనారాయణరెడ్డి, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, సూరా సుధాకర రెడ్డి, ఎన్బీ సుధాకర రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, కాయం వెంకటరత్నం, బ్యాంకు శాంతమ్మ, కుమారమ్మ, రావిళ్ల సుబ్బరాయులు నాయుడు, మధు, మన్నెం శ్రీనివాసులు, రుద్రకోటి సదాశివం, సుజాత తదితరులు పాల్గొన్నారు.