జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరణం ఇచ్చి భార్యను వదిలించుకున్నా అని మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేశారని రాష్ఠ్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై రాజకీయ విమర్శలు వస్తే వాటిని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ మహిళలను అవమానించేలా మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనే పవన్ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని తీవ్రంగా కలచి వేసిందన్నారు. ‘నా దగ్గర డబ్బుంది నేను మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చాను చేతనైతే మీరు చేసుకోండి’ అని ఈ నెల 18 వ తేదీన జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మహిళా కమిషన్ శనివారం నాడు ఇచ్చిన నోటీసుల్లో చైర్మన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. తక్షణమే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని, భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నా అని చెప్పడం మహిళల అత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ‘కోట్ల రూపాయల భరణం ఇచ్చి ముగ్గురు పెళ్లాలకు విడాకులు ఇచ్చాను. చేతనైతే మీరు చేసుకోండి’ అన్న వ్యాఖ్యలు మహిళలంటే పవన్ కు ఎంత మాత్రం గౌరవం ఉందో తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.
భరణం పేరుతో డబ్బులు ఇస్తూ మహిళలను వదిలించుకుంటూపోతే మహిళల జీవితానికి భద్రత ఎక్కడుంటుందని ప్రశ్నించారు. సినీ హీరోగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన అభిమానులు తనను అనుసరిస్తారనే ఆలోచన లేకుండా, మహిళలను అవమానించారని విమర్శించారు. స్టెప్ని అనే పదాన్ని మహిళను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించే వ్యక్తులు మాత్రమే ఉపయోగిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా మహిళలు ఫిర్యాదు చేశారని తెలిపారు. మూడు పెళ్లిళ్లపై వ్యాఖ్యలు మహిళల భద్రతకు ప్రమాదంగా మారిందని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేసారు.