నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకులను నేడు కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎండిపోయిన మంజీరా ప్రాజెక్టును చూసి అక్కడి రైతులను పరామర్శించేందుకు వెళుతున్న పిసిసి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోలీసులు నేడు అరెస్టు చేశారు.
ఆయనతో బాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేసి బిడిఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంజీరా ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. అక్కడ నుంచి నీరు రాక పోవడమే కాకుండా బోరు వేసుకుని వ్యవసాయం చేసుకొందామంటే 1200 అడుగులకు వెళ్లినా నీరు రావడం లేదు.
దాంతో ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్ చెరు, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరే కాకుండా కనీసం తాగునీరు కూడా లభించని దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
ఈ సమస్యలు తీర్చేందుకు మంజీరా బ్యారేజిలో గోదావరి నీటిని నింపాల్సి ఉండగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించే అవకాశం కూడా తమకు ఇవ్వకుండా కేసీఆర్ నిరంకుశంగా తమను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.