రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు సంబంధించి నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించేందుకు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ, ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన “బైజూస్’ అనే సంస్థతో విద్యా వ్యాపారానికి కోట్లాది రూపాయలతో ఒప్పందం చేసుకోవటాన్ని రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని ప్రగతి నర్సింగ్ హోమ్ లో ఉమ్మడి కడప జిల్లా పిడియస్ యు కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న,పిడియస్ యు జిల్లా కార్యదర్శి ఓ.నాగేంద్రబాబు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు సగం మందికి స్మార్ట్ ఫోన్ లేక, మరికొంత మంది విద్యార్థులకు నెట్వర్క్ సరిగ్గా అందే పరిస్థితి లేదన్నారు. దీని వల్ల లక్షలాది మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు.
ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్, ల్యాబ్ ట్యాబులు అందిస్తామన్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 30 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.పాఠశాలలో విద్యార్థికి భౌతికంగా అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని,వారికి పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు అన్నమయ్య జిల్లా నాయకులు స్వరూప్ తేజ,పీడీఎస్ యు నాయకులు అల్లా బకాష్, గౌస్, ఓబులేష్, ప్రశాంత్, శ్రీనివాసులు రెడ్డి,రాజంపేట నాయకులు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.