సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు, విద్వేషాన్ని రగుల్చే వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను సవరించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.
వినీత్ జిందాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖను, కార్పొరేట్ వ్యవహారాల శాఖను, టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖను, ట్విట్టర్, ఫేస్ బుక్ లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అర్మిన్ నవాబీ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా నుంచి హిందూ దేవతలను అత్యంత నీచంగా వ్యాఖ్యానిస్తూ ట్విట్ చేశాడని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే దానికి కూడా పరిమితులు ఉండాలని, బాధ్యతలు కూడా ఉండాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. చాలా దేశాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపైనా, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు బాధ్యతలను కూడా నిర్వచించారని ఆయన తెలిపారు.
గతంలో లాగా మతకలహాలు జరిగితే ఒక ప్రాంతానికి పరిమితం అయ్యే పరిస్థితి సోషల్ మీడియా వ్యాప్తి కారణంగా ఇప్పుడు ఉండదని, దేశం మొత్తం క్షణాల్లో ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉంటుందని ఆయన తన పిటిషన్ లో ఆందోళన వ్యక్తం చేశారు.