పుట్టిన రోజు సందర్భంగా ‘‘వైఎస్ఆర్ దాడి పథకం’’ ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు సలహా ఇచ్చారు. గత రెండున్నర ఏళ్ళుగా ‘‘వైఎస్ఆర్ దాడి పథకం’’ లో భాగంగా విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ నుంచి నిన్న ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా వరకూ ఎందరిపైనో దాడి చేశారని ఆయన అన్నారు. విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు వివిధ వర్గాల ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. ‘‘వైఎస్ఆర్ దాడి పథకం’’లో భాగంగా తనను కూడా లాకప్ లో చిత్ర హింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనను లాకప్ లో పోలీసులు కొట్టిన సందర్భంగా తాను తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నానని ఆయన వివరించారు. ఆ లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటానని రఘురామకృష్ణంరాజు విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
previous post